1997 భారత దేశానికి స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలు. స్వర్ణోత్సవ వేడుకలను అఖండ భారతం అంగరంగవైభవంగా జరుపుకుంటుంది.పరతంత్రం వీడి యాభై ఏళ్ళు గడిచాయని సంబరాల్లో ఉన్నారు అందరు అప్పుడు ఒక గొంతుక "అర్ధ శతాబ్దపు అజ్ఞ్యానాన్ని స్వతంత్రంమందామా? స్వర్ణోత్సవాలు చేద్దామా?" అంటూ బిగ్గరగా అరిచింది అర్ధ శతాబ్దపు అజ్ఞానమా?................ ఒక్కసారిగా ఏదో నిశ్శబ్దం ఇదేంటి స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలు అయింది అని సంబరాలు చేసుకుంటుంటే,ఈ మాట ఏమిటి అంటూ ప్రశ్న
ఆ మాట వినగానే ఓ ఉలికిపాటు. ఆశ్చర్యం,మెల్లిగా ఒక ఆలోచన,లోతుల్లోకి వెళ్లి ఆత్మపరిశీలన చేసుకుంటే ఆ మాటలో అతిశయోక్తి ఏమి లేదు,కానీ ఈ నిజాన్ని ఇంత పచ్చిగా ఎందుకు చెప్పాల్సొచ్చింది ఎందుకింత కోపం,ఎందుకింత ఆవేశం,ఎందుకంత కఠినంగా మాట్లాడాలి?? నిజానికది కోపం కాదు,ఆవేశం కాదు,. అది భాధ,ఆవేదన,ఆక్రన్దన కులాలకోసం మాతాలకోసం తలలు పగలకొట్టుకునే,ప్రాణాలు సైతం తీసే ఈ జనాలు,సమాజ శ్రేయస్సు కోసం ఎందుకు ముందుకు రారు ?? ఇలాంటి జానాల కోసం,ఏ పరిచయం లేని ఈ మనుషులకోసం నిత్యం ఎవరో భరతమాత పాదాలను తమ రక్తం తో ఎందుకు కడగాలి???
ధైర్యం అంటే పదిమందితో కలిసి ఎదో దిక్కుకి నడవడం కాదు లక్ష్యం కోసం ఒంటరిగానైనా ముందుకు సాగడం. అలంటి ఒక నిర్ధేశిత లక్ష్యం ఉన్న కొన్ని వేలమంది,చీకటిని చీల్చి వెలుగుని పంచాలనుకునే భానుని కిరణాలు ఎందుకు అడవి చెట్టు నీడల్లో దాక్కొని బ్రతకాలి?? సరిహద్దుల్లో దేశ రక్షణ,కోసం ,దేశ భద్రతా కోసం పోరాడాల్సిన సైన్యం.శాంతిభద్రతలకోసం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన వ్యవస్థలు ఎందుకు అడవుల్లో యుద్ధం చేయాలి ఆ యుద్ధం లో ఎందుకు ప్రాణాలర్పించాలి??? సమాజం లో మార్పు కోసం కొందరు, సమాజ రక్షణ కోసం ఇంకొందరు తమలో తాము పోరాడుకుంటుంటే,బలిదానాలు చేస్తుంటే ,ఆ సమాజం మాత్రం తమకేమి పట్టనట్టు రాతి శిలలా మాంసపు ముద్దలా నిశ్చలంగా నిలబడిపోయింది అందుకే వందకోట్ల జనాభా ఉన్నా భరతమాత అనాధాగానే మిగిలింది దేశ గతిని,తనరాతని మార్చడానికి గీత దాటి ముందుకు రాక అధికార మదం తో శాసిస్తూ పాలించే వ్యవస్థకి -అవినీతికి విశృంఖల అధికారం కట్టబెట్టి ప్రజలే స్వాములై పాలించాల్సిన ప్రజాస్వామ్యం లో కనీసం ప్రశ్నించడం కూడా చేతకాక కబోది లా నిలబడిపోయింది సమాజం
ఇటువంటి సమాజంకోసమా స్వతంత్ర యుద్ధ భూమిలో అన్ని వేలమంది ప్రాణాలర్పించిందిఇలా ఎవరి స్వార్థం వారు చూసుకునే సమాజం కోసమా మళ్లీ ఇప్పుడు ఇన్ని వేలమంది అశువులు బాసేది ఏం సాధించామని స్వర్ణోత్సవాలు ఏం సాధించామని సంబరాలు అందుకే అర్ధ శతాబ్దపు అజ్ఞ్యానాన్ని స్వతంత్రంమందామా?అని ఆ గొంతు అంత తీవ్రస్వరం తో నినదించింది అప్పటికి ఇప్పటికి ఆ మాటలో పెద్దగా తేడా ఏమిలేదు,ఒక్క ఆ సంఖ్య తప్ప,అదే సమాజం అదే,అజ్ఞానం