ఎక్కడ ధర్మం అధర్మం అవుతుందో ఎక్కడ న్యాయం అన్యాయం అవుతుందో అక్కడ ఆ చోటికి నేను తప్పకవస్తాను అని భగవంతుడు వాగ్ధానం చేస్తాడు అందుకు తగ్గట్టుగానే దశావతరాలు ఎత్తాడు.. శ్రీకృష్ణావతారం భగవంతుని తొమ్మిదవ అవతారం. కృష్ణుడు పుట్టినరోజునే శ్రీకృష్ణాష్టమిగా పండుగ జరుపుకుంటాం. హిందూ సంస్కృతి, పురాణాల ఆధారంగా కృష్ణుడిని వివిధ రకాలుగా భావిస్తుంటాం.. అల్లరి చేసే చిలిపి చిన్ని కృష్ణుడిగా, గోవులను రక్షించే పశువుల కాపరిగా, వెన్నె దొంగగా, గోపికల ప్రేమను దోచుకున్న వారిగా, ఒక మనిషి పుట్టిన దగ్గర నుండి చచ్చేంత వరకు ఎలా బ్రతకాలో భగవద్గీత ద్వారా వివరించిన గురువుగా, ద్వారకను నిర్మించిన గొప్ప ఇంజనీర్ గా, నీతి ఎటువైపు ఉంటే తను అటువైపు ఉండి చిరునవ్వుతోనే కౌరవులపై పాండవులను కురుక్షేత్రంలో గెలిపించిన కింగ్ మేకర్ గా గొప్ప రాజనీతిజ్ఞుడిగా ఇలా పలు విధాలరూపం శ్రీకృష్ణుడిది.
సుతపుడు, ప్రుస్ని అనే ఇద్దరు భగవంతుడిని ప్రత్యక్ష్యం చేసుకోవడం కోసం తపస్సు చేస్తారు.. ఆ తపస్సుకి మెచ్చి భగవానుడి ప్రత్యక్ష్యం అయ్యి ఏం వరం కావాలో కోరుకొమ్మంటే "నువ్వు మాకు కుమారుడిగా జన్మించాలి నువ్వు నా గర్భంలోనే శిశువుగా రూపుదిద్దుకోవాలి అంటూ మూడుసార్లు అడుగుతారు" ఆ కోరిక మేరకు భగవంతుడు వారికి మూడుసార్లు కొడుకుగా పుడతానని వాగ్ధానం చేస్తాడు.. అలా మొదట ప్రుస్ని గర్భుడిగా, ఆ తర్వాత అదితి కశ్వపులుగా పుట్టినప్పుడు వారికి వామనుడిగా, మళ్ళి వారే దేవకి వసుదేవులుగా అవతరించినప్పుడు శ్రీకృష్ణుడిగా జన్మిస్తాడు. శ్రావణమాసం బహుళ అష్టమిరోజున దేవకి వాసుదేవునికి అర్ధరాత్రి ఒక జైలులో జన్మించాడు.
అంతటి దేవదేవుడు ఒక జైలులో పుట్టడానికి ఒక బలమైన కారణం ఉంది. కంసుడు రాజుగా ప్రజలను కిరాతకంగా పాలిస్తుంటాడు తన మరణం అనేది కేవలం మేనళ్ళుడు తోనే సంభవిస్తుందని ఒక అ శరీరవాణి ద్వారా తెలుస్తుంది. అందుకే తన సోదరి ఐన దేవకిని జైలులో బంధించి తనకి పుట్టిన పిల్లవాడిని చంపాలనుకుంటాడు.. శ్రీకృష్ణుడు పుట్టగానే వసుదేవుడు దైవ బలంతో అక్కడినుండి యశోద ఒడికి చేరుస్తాడు తర్వాత కాలంలో శ్రీకృష్ణుడు కంసుడిని చంపేసి దేవకి వసుదేవులని ఆ జైలు నుండి విడిపిస్తాడు.