Meet Jyothi, A Woman Who Started Organic & Healthy 'Baby Food' Company & Her Story

Updated on
Meet Jyothi, A Woman Who Started Organic & Healthy 'Baby Food' Company & Her Story

మన తరం కాదు.. మన అమ్మానాన్నల తరం కూడా కాదు.. మన తాతయ్య అమ్మమ్మల/నాయనమ్మ ల తరం గురుంచి మాట్లాడుకోవడం ప్రారంభిస్తే రకరకాల అభిప్రాయాలతో పాటుగా వారి క్రమశిక్షణ గురుంచి మాట్లాడుకోవాల్సి వస్తుంది, బంధాలు అనుబంధాలకు ఇచ్చే విలువల గురుంచి మాట్లాడుకోవాల్సి వస్తుంది, మరి ముఖ్యంగా వారు తీసుకున్న ఫుడ్ గురుంచి గంటలు గంటలు మాట్లాడుకోవాల్సి వస్తుంది.. "వాళ్ళదిరా అసలైన భోజనం, 90 ఏళ్ళు వచ్చినా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో చూడు.. ఏ పెస్టిసైడ్స్ వాడని ఫుడ్, మిల్లెట్స్, రాగి, జొన్నలు తినేవాళ్ళు అందుకనే ఈ వయసులో కూడా ఇంత బాగున్నారు".. సైన్టిస్ట్ నుండి సామాన్యుడి వరకు మన తరంలో తెలుసుకోగలిగిన మరో గొప్ప విషయమేమిటంటే పెస్టిసైడ్స్ వాడని ఫుడ్, అన్నం కన్నా మిల్లెట్స్, రాగులు జొన్నలు మొదలైనవి మంచి భోజనం అని తెలుసుకోగలిగాము. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఆర్గానిక్ ఫుడ్ వైపు మల్లుతున్నారు మరి కొందరు ఈ రంగంలో ఓ స్టార్టప్ లను ప్రారంభించి వారు ఎదుగుతూ ప్రజల ఆరోగ్యానికి మంచిచేస్తున్నారు. జ్యోతి గారు కూడా ఇలాంటి స్టార్టప్ నే మొదలుపెట్టారు కాకపొతే ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం..

కేవలం 25,000తో మొదలై: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జ్యోతి గారు తనకెంతో ఇష్టమైన ఎంఫార్మసీ రామచంద్ర యూనివర్సిటీలో చదివారు.. ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం, ఆ తర్వాత వారి కలల పంటగా బాబు కలిగాడు. చిన్నతనం నుండే బలమైన ఆహారం అందిస్తే బాబు జీవితాంతం ధృడంగా ఉండగలుగుతాడు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని డాక్టర్లను, పెద్దవారిని సలహా అడిగారు. పోషకాహారం అందించే అన్ని బ్రాండ్ల పౌడర్లలో ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి, ఇవి దీర్ఘకాలంలో అనారోగ్యం సృష్టించగలవు అని చెప్పారు వారు. ఆర్గానిక్ ఫుడ్ ను ఇంట్లోనే తయారుచేసి పెట్టండి అని సలహా ఇచ్చారు కూడా. అలా జ్యోతి గారు ప్రత్యేకంగా రీసెర్చ్ మొదలుపెట్టి అనుభవజ్ఞులైన వారి సూచనలు తీసుకుని తేలికగా జీర్ణం అయ్యే వివిధ పప్పులు, ధాన్యాల్ని సంప్రదాయ పద్దతిలో పొడిచేసిందే ఉక్కిరి (ఉగ్గు) బాబుకు పెట్టేవారు.

బాబు ఇష్టంగా తినేవాడు. మొదట తన బాబుకు, ఆ తర్వాత బంధువుల పిల్లలకు పెట్టడం వారు ఆరోగ్యంగా చురుకుగా ఉండటాన్ని గమనించిన మిగిలిన తల్లిదండ్రులు జ్యోతి గారు తయారుచేసే ఫుడ్ ను అడగడం మొదలుపెట్టారు. అవసరం ఎక్కువ ఉంది ఇదే వ్యాపారంగా మొదలుపెడితే తనకు ఇంకా మిగిలిన వారికి కూడా ఉపయోగం అని కేవలం 25వేల రూపాయలతో "Nutreat" ను 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు. Nutreatలో వాడే ఆహార పదార్ధాలన్నీ ఆర్గానిక్ యే. సాంప్రదాయ పద్దతిలో కుండలో వేయించడం, రోలు, తిరగాలి ద్వారా గ్రైండ్ చెయ్యడం మొదలైనవన్నీ మన పెద్దవారు ఎలా చేసేవారో అలానే తయారుచేస్తున్నారు.

కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా: ప్రస్తుతం జ్యోతి గారు ప్రతినెల ఆన్ లైన్ ద్వారా 300 నుండి 400కేజీల బేబీ ఫుడ్ అమ్మగలుగుతున్నారు. ఇంతమంచి పేరు, టర్నోవర్ పెరగడానికి పెద్ద పరిశోధన దాగి ఉంది. మిల్లెట్స్, పండ్లు, కూరగాయలు మనకు రెగ్యులర్ గా దొరికే 15 రకాల ఆహార పదార్ధాలతో పరిశోధన చేశారు. కొంతకాలం పాటు ఉచితంగానే ఇచ్చేవారు కూడా. తీసుకున్నవారికి బాగా నచ్చడం, పోషకాహారం పూర్తిగా పిల్లలకు అందుతుండడం వల్ల డిమాండ్ పెరిగి ఎక్కువమంది అడిగేవారు అప్పుడే వ్యాపారం మొదలుపెట్టారు. Nutreat కేవలం పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జ్యోతి గారు అమ్మగలుగుతున్నారు, డిమాండ్ ఎక్కువగానే ఉన్నా బేబీ ఫుడ్ విషయంలో ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవడం లేదు. అప్పుడే భావాలను మాటల్లో చెప్పలేని ప్రతిబిడ్డకు మంచి ఆహారాన్ని ఇవ్వడమే తన లక్ష్యం. బాబు జ్యోతిగారి జీవితాన్నే కాదు ఎందరో బిడ్డల ఆరోగ్యానికి కారణమయ్యాడు. దీనికి కారణమైన జ్యోతి గారి బాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

For more details: http://www.nutreatlife.com