విశ్వమానవ సమానత్వం గురించి గర్జించిన కవి చక్రవర్తి గుఱ్ఱం జాషువా

Updated on
విశ్వమానవ సమానత్వం గురించి గర్జించిన కవి చక్రవర్తి గుఱ్ఱం జాషువా
ఆధునిక మహాకవి, కళా ప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి, పద్మభూషణ్ గుఱ్ఱం జాషువా గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే “తండ్రి యాదవా, తల్లి మాదిగ, పుట్టుక పేదవాడిగా, పేరు జాషువా. హిందువులు మావాడివి కావన్నారు, క్రైస్తవులు మా దగ్గరికి రాకన్నారు. పేదరికం సహనాన్ని నేర్పింది, వివక్ష ధైర్యాన్ని దగ్గర చేసింది, అక్షరాలు తోడుగా నిలబడ్డాయి, సరస్వతి ఒడిలో కూర్చోపెట్టుకుంది, భావావేశం పద్యంగా పెల్లుభికి ఎన్నో విషయాలను ప్రశ్నించింది, ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పింది, ఇంకెన్నో విషయాలను చర్చించింది, మరెన్నో సంఘటనలు వివరించింది.” అధముడైన రాజుని కూడా దేవుడిలా కీర్తించలేక, స్త్రీ అంగాంగ వర్ణనల అశ్లీలాన్ని తట్టుకోలేక, ప్రేమికుల చిలిపి, మధుర, సరస, విరహ వేదనలు పలుకలేక, భూగర్భం నుండి విశ్వాంతరాలాల మధ్యలో మళ్ళీ మళ్ళీ విహరించలేక, అద్భుత, అద్వితీయ అభూత కల్పనలకు ఊ కొట్టలేక, ప్రకృతికి పరిచయం లేని పదాలను వివరించలేక, ఆ దేవ దేవుడ్ని సైతం పొగడ్తల పద్యాల మత్తులో ముంచలేక, అవే అవే వర్ణనలు వేరు వేరు కలాల నుండి పదే పదే జన్మిస్తుంటే... సాహిత్యం ధనికుల, అగ్ర వర్ణాల వారి గృహాలలో వెట్టి చాకిరి చేస్తుంటే, సాహిత్య ప్రక్రియలు కొద్దిమంది గీసిన హద్దుల్లో బందీలుగా బ్రతుకుతుంటే, రచనలకు కూడా అంటరానితనమనే లక్షణాలు పెరుగుతుంటే... ఆ సాహితీ వేత్తలకు చెప్పలేక, ఆ కూర్పులో ఇమడలేక, ఏం చేయాలో అర్ధంకాక, అలసిపోయి దిక్కులు చూస్తున్న అక్షరాలకు కొత్త శక్తిని ఇచ్చాయి వెయ్యేళ్ళ పైగా చరిత్ర కలిగిన పద్య రూపాన్ని అస్త్రంగా చేసుకొని సమరం సాగించిన గుఱ్ఱం జాషువా కలం నుండి జాలువారిన పదాలు. “పద్యమంటే పొగడ్తేనా ? రాజు స్తుతి లేకుంటే రచన కాదా ? కులుకులు లేని కవిత ఉండదా ? ఖండించే పదాలతో రాస్తే కావ్యం కాదా ? సత్యం పలికితే సాహిత్యం ఒప్పుకోదా ? నా ఆకారం అలంకారానికి అడ్డుపడుతుందా? నేను చెప్తానంటే చంధస్సు చేరనంటుందా ? నేను పుట్టిన కులాన్ని చూసి, నా కలం నుండి కళాఖండాలు పుట్టనంటాయ ? బ్రహ్మ నుండి పుట్టినవి నాలుగే జాతులన్నారే, మరి నేను పంచముడిని ఎలా అవుతాను ?” ఇది టూకీగా చెప్పాలంటే గుర్రం జాషువా గారి ఆలోచనల అంతఃరంగం, భావావేశ తరంగం. జాషువా గారి కలం పలికిన అద్భుతాలు కొన్ని... ఆ నాటి కవులను ఉద్దేశించి... (స్త్రీల అందాలను స్తుతిస్తూ, అన్ని లోకాలలో విహరిస్తూ, ఆహ్లాదానందాలలో తేలుతుండే మీకు నిరుపేదల ఆక్రందనలు చెవుల పడతాయా.) GurramJashuva1 ఆనాటి(ఈనాటికి కూడా) సమాజంలోని పరిస్తితులను గురించి... (దేవుళ్ళ పెళ్ళికి భారీగా డబ్బు ఖర్చు చేస్తారు కాని, ఆకలితో కడుపు చేతిలో పట్టుకొని అడుక్కునే పేదవారి పాత్రల్లో ఒక్క పైసా కూడా వెయ్యరు మన దేశంలో.) GurramJashuva2 ఆయన పుట్టుకను పట్టుకొని రచనలను మనస్పూర్తిగా అభినందించని సమయాల్లో... (నా రచనలు విని ఎంతో సంతోషించి, నన్ను అభినందించినవాడే, నా కులమేదో తెలుసుకొని, ఉన్నపళంగా నా నుండి దూరంగా వెళ్ళిపోతే గుండెను పిండేసినట్లు అనిపిస్తుంది) GurramJashuva3 పంచమ జాతిలో పుట్టి సాహితీ వేత్తగా ఎదగటం చాలా గొప్ప విషయం. ఇలాంటి మాటలు ఎవరైనా అంటే... (దేనికీ పనికిరాని వెధవలు నన్ను ఏదో అన్నంత మాత్రాన, నా జ్ఞానం నన్ను వీడిపోతుందా) GurramJashuva4 ఆయన స్వభావం గురించి... (కుల మతాలు చెప్పినట్టు తలాడించే వాడిని కాదు నేను, ఎవ్వరేమనుకున్నా వీటన్నిటికి అతీతమైన విశ్వనరుడుని నేను) GurramJashuva5 నిజమైన కవి గురించి... (రాజు మరణిస్తే ఒక తార నేలరాలిపోతుంది, అదే కవి మరణిస్తే ఒక తార నింగిలో చేరుతుంది. రాజు రాతి విగ్రహాలలో జీవిస్తే, తన రచనలు చదివే ప్రజల హృదయాల్లో ఎప్పుడూ జీవించే ఉంటాడు కవి.) GurramJashuva6 చివరిగా ఆయన జీవితం గురించి ఆయన మాటల్లో... “జీవితం నాకు ఎన్నో పాటలు నేర్పింది. నాకు గురువులు ఇద్దరు - పేదరికం, కుల మత భేదం. ఒకటి నాకు సహానాన్ని నేర్పితే, రెండోది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే కాని బానిసగా మార్చలేదు. దరిద్రాన్ని, కుల మతాలను కూడా చీల్చి నేను మనిషిగా నిరుపించుకోదలచాను. వాటిపై కత్తి కట్టాను, ఐతే నా కత్తి నా కవితే.”