A 23 Year Old Hyderabadi Ammayi Became A Junior Civil Judge & Here's Her Story

Updated on
A 23 Year Old Hyderabadi Ammayi Became A Junior Civil Judge & Here's Her Story

23 ఏళ్లకే జడ్జ్ ఏంటండి బాబు.. అని మనకు అనిపిస్తూ ఉండవచ్చు, స్వాతి గారికి ఇంకా వారి అమ్మ నాన్నలకు ఇదేమంత ఆశ్చర్యకరమైన సంఘటన కాదు. ఎందుకంటే స్వాతి గారు చిన్నతనం నుండి అంతే, దేనికీ ఒక పట్టాన ఫిక్స్ అవ్వరు, ఒకవేళ ఫిక్స్ ఐతే కనుక 100% దానిని పూర్తిచేస్తారు. ఈ మనస్తత్వమే తనని ఈ స్థాయికి తీసుకువచ్చింది. అనుకున్న దానికి మనస్ఫూర్తిగా కట్టుబడి ఉండడం మూలంగానే నేడు భారత దేశంలోనే అతి చిన్న వయసులోనే ఒక మహిళ జూనియర్ సివిల్ జడ్జ్ గా బాధ్యతలు తీసుకోబోతున్నారు.

విజన్: ఇంటర్మీడియట్ సిఈసి చదువుతున్నప్పటి నుండే తనకు 'లా' పట్ల ఇష్టం పెరిగింది. ఒకరోజు జరిగిన కాలేజ్ ఫంక్షన్ కు అతిథిగా వచ్చిన ఓ ప్రముఖ వ్యక్తి స్వాతి గారిని "నీ డ్రీమ్ ఏంటి" అని అడిగారు. దానికి స్వాతి గారు సుప్రీంకోర్టు కోర్టుకు మొదటి మహిళా న్యాయ మూర్తిని కావాలని అనుకుంటున్నాను అని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే తన మార్గం కొనసాగింది. ఇంటర్ తరువాత పెండేకంటి లా కాలేజీలో LLB పూర్తిచేశారు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు నిర్వహించిన 67 జూనియర్ సివిల్ జడ్జ్ పోస్ట్ ల నియామకానికి జరిగిన పరీక్షలో 2వ ర్యాంక్ సాధించి(350 మార్కులకు గాను 241.16మార్కులు వచ్చాయి) యంగెస్ట్ జడ్జ్ అయ్యారు. ఇందుకోసం తను రోజులో సగానికి పైగా కష్టపడలేదు, కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉపయోగించింది. మిగిలిన సమయమంతా చదివిన దాన్ని రివిజన్ చేసుకోవడం, హాయిగా ఫ్రెండ్స్ తో కుటుంబంతో గడిపేవారు.

సోషల్ మీడియా డీ యాక్టివేషన్ ఎందుకు.? స్వాతి గారి కుటుంబం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుండి హైదరాబాద్ కు ముప్పై సంవత్సరాల క్రితం వచ్చారు. నాన్న సత్యనారాయణ గారు కంప్యూటర్ వ్యాపారి, అమ్మ పద్మప్రియ గారు రైల్వే ఉద్యోగిని. మనం సరిగ్గా ఉపయోగించుకుంటే కనుక ఏది మనల్ని వెనక్కి నెట్టి వెయ్యలేదు. ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అంటే చాలామంది సోషల్ మీడియాలో ఉన్న అకౌంట్స్ అన్ని డీ యాక్టివేషన్ చేసేసుకుంటారు, నిజానికి సోషల్ మీడియాను మనం ఎందుకు నెగిటివ్ గా చూసుకోవాలి.? దానికి బానిస అయినవారే దానికి భయపడిపోతుంటారు. ఎంటర్టైన్మెంట్ అనేది చదువుకు ఏ మాత్రం అడ్డం కాదని స్వాతి గారి నమ్మకం. సోషల్ మీడియాను కూడా తన లక్ష్యానికి ఒక కారకంలానే ఉపయోగించుకున్నారు. జీవితానికి అవసరమయ్యే మోటివేషన్, తను నేర్చుకున్న విషయాలను, ఫ్రెండ్స్ తో గడిపిన ఆనంద క్షణాలను ఫేస్ బుక్ లో నిత్యం పంచుకుంటారు.

బాధితులకు న్యాయం చేస్తాను: ప్రతి ఒక్కరికి న్యాయం సమంగా అందాలనే లక్ష్యానికి అనుభవం కూడా తోడైంది. స్వాతి గారు ఇంటర్న్ షిప్ కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తులైన జస్టిస్ గోపాలగౌడ, ఎస్. రాధాకృష్ణన్, మరియు ప్రస్తుత అటార్నీ జనరల్ వేణుగోపాల్ గారి దగ్గర ఇంటర్న్ షిప్ పూర్తి చేశారు. వీరి సాంగత్వం మూలంగా మరింత జ్ఞానం సంపాదించుకున్నారు. జడ్జ్ అవ్వాలన్నదే తన మొదటి లక్ష్యం తన గది గోడ మీద కూడా "ఫస్ట్ ర్యాంక్" అని రాసుకున్నారు, రోజులో ఎంపిక చేసుకున్న సిలబస్ పూర్తిచేసిన తర్వాతనే భోజనం పూర్తిచేసేవారు. చదువులో పెట్టిన ఇంతటి శ్రద్ధను రేపు బాధితులకు న్యాయం చేయడంలోనూ చూపెడతానని స్వాతిగారు ఈపాటికె మరో లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు.