"బుద్దుడు ప్రశాంతంగా ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తున్నారు.. ఎక్కడి నుండో ప్రయాణం చేసుకుంటు వస్తున్నట్టుగా ఒక జ్యోతిష్కుడు వచ్చి బుద్దుడిని గమనించాడు. అతనికి అంతా అయోమయంగా ఉంది".
అతనొక ఘనత వహించిన జ్యోతిష్కుడు. ఎన్నో పుస్తకాలు, ఎంతోమంది గురువులను కలిసి జ్యోతిష్య విద్యను నేర్చుకున్నాడు. బుద్దుడిని చేరడానికి కారణం బుద్దుని పాద ముద్రలే. "తడి భూమి మీద బుద్దుని పాద ముద్రలు చూసి పరిశీలించగా ఇది మాములు వ్యక్తి పాద ముద్రలు కాదు ఇతను సమస్త భూమికి చక్రవర్తి ఐన వ్యక్తి పాద ముద్రలు అని నిశ్ఛయించుకుని ఆ పాదముద్రలే దారిగా ఎంచుకుని బుద్దుడుని చేరుకున్నాడు". పాదముద్రల చివరిన ఒక మహారాజు ఉంటాడనుకుంటే ఒక భిక్షవాని ఆకారంలో ఉన్న వ్యక్తి, పక్కనే భిక్ష కోసం ఉపయోగించే పాత్ర ఉండడం చూసి ఆశ్ఛర్యపోయాడు.
జ్యోతిష్కునికి బుద్దుని తేజస్సు, అతని దివ్యమైన రూపం చూసి భిక్షవానిలా అనిపించడం లేదు. ఇంతకి ఇతను ఎవరు.? నేను సరిగ్గా విద్య నేర్చుకోలేదా?.. ఇలా రకరకాల ఆలోచనలు అతని మదిని తొలిచేస్తున్నాయి. దీనికి సమాధానం ధ్యానంలో ఉన్న ఆ వ్యక్తి మాత్రమే చెప్పగలడు అని బుద్దుని పాదాలని వినమ్రంగా తాకి ఇలా ప్రశ్నించారు.. "మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అయోమయంగా ఉంది ఇంతకి మీరు ఎవరు..?, మీ పాద ముద్రలను పరిశీలిస్తే అర్ధం అయ్యింది మీరు ఖచ్చితంగా ఒక మహారాజు అయిఉండాలి, ఈ ధరిత్రిని మీరు పాలించాలి.. కాని మీరు ఇలా చెట్టు కింద కూర్చున్నారు. నాకు చాలా అనుమానంగా ఉంది నేను సరిగ్గా విద్య నేర్చుకోలేదేమోనని, మిమ్మల్ని సరిగా అంచణా వేయలేదని.. బహుశా నేను చదివిన పుస్తకాలలో తప్పు ఉండి ఉంటుందని అనుమానంగా ఉంది". అని అన్నాడు.
దానికి బుద్దుడు ఇలా చెప్పాడు. నువ్వు అనుకున్నది నిజమే. నేను రాజునే, కాని నువ్వు అనుకున్న విభాగానికి కాదు.. నేను ఎవ్వరితో పొల్చలేని వ్యక్తిని.
జ్యోతిష్కుడు: మీరు నన్ను మరింత అయోమయానికి గురిచేస్తున్నారు. మీరెలా ఇంకొకరితో పోల్చలేకుండా ఉంటారు..? నాకు తెలిసి మీరు దేవుడు అయిఉండవచ్చు. మీ కళ్ళను చూస్తే ఆ విషయం తెలుస్తుంది. బుద్దుడు: లేదు, నేను భగవంతుడిని కాదు. జ్యోతిష్కుడు: మీరు నాకు చెప్పకుండా ఏదో దాచి పెడుతున్నట్టుగా ఉంది. అసలు మీరు ఎవరు.? మీరు ఒక జంతువు కాదు.. మీరు ఒక చెట్టు కాదు.. మీరు ఒక రాయి కాదు. అసలు మీరు ఎవరు..?
అప్పుడు చివరిగా బుద్దుడు ఇలా బదులిచ్చాడు.. "నేను బుద్దుడిని అంతే, ఇంకెవ్వరిని కాదు.
నిజానికి మనమెవ్వరం పనికిరానివారం కాదండి, ప్రతి ఒక్కరి అవసరం ఈ ప్రపంచానికి ఉంది. గౌతమ బుద్దుడు ఒక కారణం కోసం పుట్టారు, జీసస్ ఒక కారణం కోసం పుట్టారు. మహాత్మ గాంధీ, భగత్ సింగ్, మార్టిన్ లూథర్ కింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది.. ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణం కోసం పుట్టాము.. కాని మనమే మనమెవ్వరమో తెలుసుకోలేక పోతున్నాము. తెలుసుకున్న వాళ్ళు గొప్పవారిగా ఎదిగితే, తెలుసుకోలేని వాళ్ళు అలాగే మిగిలిపోతున్నారు.. మనమెవరమనేది తెలుసుకోవాల్సినది ముందు మనమే అంతేకాని జ్యోతిష్కులు చెప్పడమేంటి.? జ్యోతిష్కులు చెప్పేవన్నీ నిజమైతే ఈనాటికి ప్రపంచంలో ఇన్ని ఆకలి చావులే ఉండేవి కావు, ఇన్ని ప్రకృతి వైపరిత్యాలలో అమాయకులు చనిపోయేవారే కాదు, వారు చెప్పినట్టు జరిగితే ప్రతి ఒక్కడు సంపన్నుడయ్యేవాడు.
ఇక్కడ ప్రతి ఒక్కడు ఒక ప్రత్యేకమైన వాడే, ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేక శక్తి ఉంది.. దానిని తెలుసుకుని ముందుకు సాగితే ఈ ప్రపంచానికి మనమేంటో తెలిసిపోతుంది. రమణ మహర్షి చెప్పినట్టు "మన శరీరానికి ఫలానా అడ్రస్స్ ఉన్నట్టే మన ఆత్మకు కూడా ఒక అడ్రస్స్ ఉంటుంది.. ఇక్కడ నువ్వు అంటే నీ ఆత్మ.. ఇంతకి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు.? ఏ లక్ష్యం కోసం, ఏ కారణం కోసం ఇక్కడికి వచ్చావు.? అది తెలుసుకుంటే మనం ఇంకొకరితే పోల్చుకునే అవసరం ఉండదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.