రాజకీయ పార్టీలు, ఎలక్షన్స్ అంటేనే ఒకరకమైన వెగటు భావన వచ్చేసింది.. డబ్బులు పంచితే తప్ప గెలవలేని పరిస్థితికి దిగజారిపోయింది వ్యవస్థ.. అలా డబ్బు పంచిన నాయకుడు తిరిగి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పంచిన దానికి తక్కువలో తక్కువ ఐదింతలు రాబట్టుకుంటున్నారు. ఈ నీచ వ్యవస్థ మారాలి, ప్రజల ఆలోచన ధోరణిలో మార్పులు రావాలి.. చిన్నతనం నుండే పిల్లలలో నిజమైన నాయకత్వ లక్షణాలు పెరగాలి. తద్వారా సమాజంలో ఒక ధృడమైన మార్పు సంభవిస్తుంది అని బలమైన ప్రణాళికతో యాజిలి ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో నిలబడిన అభ్యర్ధులు, ఓట్లు వేసింది కూడా విద్యార్ధులే..
సుమారు 500మంది విద్యార్ధులున్న ఈ పాఠశాల 6ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిసరాల శుభ్రత మొదలైన వాటన్నీటి నిర్వహణ కోసం కొంతమంది సిబ్బంది అవసరం ఉంటుంది. ఆ సిబ్బంది మరియు ఆ సిబ్బందికి నాయకత్వం వహించే వ్యక్తిని ఎలక్షన్ ద్వారా విద్యార్ధులే ఎన్నుకున్నారు.. ఇందుకోసం ఉపాధ్యాయులు కొంతమంది విద్యార్ధులను సెలెక్ట్ చేసి ఎలక్షన్స్ నిర్వహించారు. ఈ ఎలక్షన్స్ లో పాల్గొనే అభ్యర్ధులందరూ తమకు ఓట్లు వేసి గెలిపిస్తే ఏ కార్యక్రమాలు చేపడతామో అని తమ ఎజెండాను సిద్ధం చేసుకుని ఒక ప్రత్యేక సమయంలో ప్రచారం ద్వారా మిగిలిన విద్యార్ధులకు వివరించారు.
ఎప్పుడైన అభ్యర్ధి విజయం అనేది అతను ఇచ్చే హామీలపై ఆధారపడి ఉంటుంది. "ఇప్పుడు నాయకులు ఎలాగున్నారంటే.. "ఎలాగైనా గెలవాలి అని.. అవిస్తాం ఇవిస్తాం అని ఆచరణ యోగ్యం కాని హామీలన్ని ఇచ్చేస్తారు, తీరా గెలిచాక పొంతన లేని కారణాలు చెప్పి వదిలేస్తారు.." కాని ఈ ప్రభుత్వ పాఠశాలలో జరిగే ఎన్నికలలో విద్యార్ధులు తాము ఇచ్చే హామీలన్నీ ఆచరణ యోగ్యమా కాదా అని అధ్యయణం చేసి, ఉపాధ్యాయుల నుండి సూచనలు తీసుకుని మరి హామీలను ఇచ్చారు. ఎలక్షన్స్ కూడా సాధారణ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో అదే విధంగా జరిగాయి. గెలిచిన అభ్యర్ధి తాను ఏదైతే హామీలను ఇచ్చారో ఆ వాగ్ధానాలను ఖచ్చితంగా పూర్తిచేయ్యాల్సి ఉంటుంది.. అభ్యర్ధి పదవీకాలం ఒక సంవత్సరకాలం ఉంటుంది. ఈ సంవత్సర కాలంలో ఒకవేల ఆశించినంత మేరకు పనులు జరగకుంటే కొంతమంది విద్యార్ధులు కలిసి ఒక పిర్యాదుని అందిస్తే ఆ అభ్యర్ధిని రీకాల్ చేసి ఎన్నికలలో పోటిచేసిన అభర్ధులలో ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. ఎక్కువ శాతం ఈ పాఠశాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నీటికి అవసరమయ్యే డబ్బు కొంతమంది దాతలు అందిస్తున్నారు.
"దేశంలో మంచివారు తగ్గిపోతున్నారు, నేరాలు అధికమవుతున్నాయి" ఇందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నాయకుల పాత్ర ప్రత్యక్షంగానైన, పరోక్షంగానైన ఉంటుంది. తెలుగులో ఒక సామెత ఉంది "మొక్కై వంగనిది మానై వంగునా" అని.. అందుకే ప్రతి ఒక్కరూ చిన్నతనం నుండే మంచి అలవాట్లు, సేవా ధర్మం, విలువలతో కూడిన వ్యక్తిత్వంతో పెరిగితే రేపు దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదుగుతారు. బాల్యం అంటే కేవలం చదువు, ఆట, పాటలు మాత్రమే కాదు రేపటి దేశ ఉన్నత భవిషత్తు కోసం నేటి నుండి సైనికులను సిద్ధం చేయడం. సరిగ్గా ఇదే విధంగా తమ విద్యార్ధులను తీర్చిదిద్దుతున్నారు గుంటూరు జిల్లా యాజిలి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు.