దేశంలో మొత్తం 140 పోలీస్ స్టేషన్లు పోటీపడగా వసతులు, సిబ్బంది పనితీరు, ప్రజల పట్ల వ్యవహరించే తీరు తెన్నులు మొదలైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జరిపిన రీసెర్చ్ తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ జాతీయ స్థాయిలో రెండవ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా క్రేంద్ర ప్రభుత్వం తరుపున అవార్డును అందుకుంది. ఇప్పుడు అదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మొదటిసారిగా సైకిల్ ద్వారా పెట్రోలింగ్ మొదలుపెట్టి, ప్రజల రక్షణ కోసం మరో ఉపయోగకరమైన విధులను కొనసాగిస్తుంది.
మన పోలీసులకు ఇప్పటి వరకు బ్లూ కోల్ట్స్, ఇన్నోవా, ఇంటర్ సెప్లార్ వాహనాలను వాడుతున్నారు. వేగంగా ప్రయాణిస్తూ శాంతి భద్రతలను కాపాడేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఐతే ఇవి వాడుతూ గల్లీ లోని మారు మూల సందులకు వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటుందని ప్రయోగాత్మకంగా ఐదు సైకిళ్లను వినియోగిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ తో నడిచే వాహనాలు పొల్యూషన్ మాత్రమే కాకుండా ప్రమాదాలు జరిగే ఆస్కారాలు కూడా ఉన్నాయి.
ఈ సైకిళ్ళన్నీ కూడా బ్యాటరీ ఆధారంగా నడుస్తాయి. లాఠీ, వాటర్ బాటిల్, సెల్ ఫోన్, వాకీటాకీ, ఫస్ట్ ఎయిడ్ కిట్, సైరన్, జీ.పి.ఎస్ సిస్టం లతో పాటు పోలీస్ సిబ్బంది త్వరగా అలసిపోకుండా ఉండడానికి అధునాతన షాక్ ఎబ్జార్వర్స్ తో సైకిల్ ను తయారుచేశారు. ఉదయం 9 గంటల నుండి సాయంతం 6 గంటల వరకు సైకిల్ ద్వారా మారు మూల సందులలో పెట్రోలింగ్ జరుపుతారు. త్వరలోనే టూరిజం ప్రాంతాలైన గోల్కొండ, చార్మినార్, త్యాంక్ బండ్, అలాగే వినాయక నిమజ్జనం తదితర ఉరేగింపులలోను సైకిల్ పెట్రోలింగ్ జరుపబోతున్నారు.