(Contributed by PSJ Raju Pasala)
చాణుక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో చెప్పిన అద్భుతమైన నీతి కధ..
ఒక అడవి లో ఒక లేడి భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది. అది నిండు గర్భిణి.. దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి. అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది. ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది. దానికి అటుపక్క నది ప్రవహిస్తోంది. అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది. నొప్పులు మొదలయ్యాయి. నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది.. అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి. ఉరుములు, పిడుగులు. పిడుగు పడి కొద్ది దూరం లోనే గడ్డి అంటుకుంది. దూరంగా తన ఉనికిని గమనించి కుడి వైపు నుండి ఒక సింహం వస్తోంది. ఎడమవైపు నుండి ఒక వేటగాడు బాణం సరి చూసుకుంటున్నాడు. ఇంకో వైపు నది వెళ్ళనివ్వదు ...!
భగవాన్ ! ఆ లేడి ఇప్పుడు ఏమి చెయ్యాలి ?.
ఏమి జరగబోతోంది ?
లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా? బిడ్డ బతుకుతుందా?
సింహం లేడిని తినేస్తుందా?
వేటగాడు లేడిని చంపెస్తాడా ?
నిప్పు లేడి వరకూ వచ్చి లేడి కూనను చంపేస్తుందా?
ఒక వైపు నిప్పు,
రెండో వైపు నది, మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపం లో వేటగాడు, సింహం. కానీ లేడి మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు..
అది తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది.. అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి.. పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరాయి. గురి తప్పి బాణం సింహానికి తగిలింది. వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి. లేడి పిల్ల తల్లి గర్భం లో నుండిబయటకు వచ్చింది. అది ఆరోగ్యం గా ఉంది.. ఏదైతే జరగనీ, నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని అది అనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి ఉండి వుంటే.. ఏమి జరిగేది????.. మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టూ ముడుతూనే ఉంటాయి. నెగటివ్ ఆలోచనలతో సతమవుతూనే ఉంటాము. మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము. భగవంతుడిపై భారం వేసి మన పని మనం చెయ్యడమే మనం చెయ్యవలసినది.